ఐదోసారి ఒడిషా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గవర్నర్ పర్యవేక్షణలో నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీజూ జనతాదల్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. తండ్రి బిజూపట్నాయక్ మరణంతో 20 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి నవీన్ పట్నాయక్ ప్రవేశించారు. ఆ తర్వాత వెనుదిరిగది చూడలేదు. మొదట్లో కాస్త ఇబ్బందిపడినా.. తర్వాత తనశైలిని పూర్తిగా మార్చేశారు. ఒడిషా రాజకీయాలను పూర్తిగా ఒంటబట్టించుకున్నారు.
ఆడంబరాలకు దూరంగా ఉండే నవీన్కు.. పొగడ్తలంటే అస్సలు నచ్చదు. ప్రాంతీయ పార్టీలు దీర్ఘకాలం మనుగడ సాగించలేదన్న విమర్శకుల నోళ్లు మూయించారు నవీన్ పట్నాయక్. ఎన్నికల ప్రచారంలోనూ తన అభివృద్ధి గురించే ప్రస్తావించేవారు కానీ.. ప్రత్యర్థులకు నేరుగా మాటకుమాట ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఎన్నికల ప్రచారంలో నవీన్ వయసు అయిపోయిందంటూ జరుగుతున్న ప్రచారానికి ఓ వీడియో ద్వారా సమాధానం ఇచ్చేరే గానీ, ప్రత్యర్థులను పల్లెత్తు మాట అనలేదు. అదే నవీన్ను ఐదోసారి సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. దేశ రాజకీయాల గురించి ఆయన ఏనాడూ ప్రస్తావించలేదు. తొలుత తనకు ఒడిషాయే ముఖ్యమని అంటుంటారు.