ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. విజయవాడ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన తొలి పెట్టుబడుల సదస్సులో జగన్ మాట్లాడిన తీరును లోకేశ్ ఎద్దేవా చేశారు. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే ఓట్లు, సీట్లు చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న వనరులు ఏమిటి? పెట్టుబడులు పెట్టేవారికి ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించనుంది? వచ్చిన వారికి ఎటువంటి ప్రగతి లభిస్తుంది? వంటి అంశాలు వివరించకుండా వైసీపీ ప్రభుత్వం సొంత భజన చేసుకుని వచ్చిన వారికి నిరాశ మిగిల్చిందన్నారు. గత ప్రభుత్వం ఈజ్ ఆఫ్ బిజినెస్ ద్వారా సాధించిన ప్రగతి గురించి వివరించలేక, తమది పేద రాష్ట్రమని జగన్ చెప్పడం సిగ్గుచేటని లోకేశ్ విమర్శించారు.