ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారంలోకి రాగానే తిత్లీ తుపాను నష్టాన్ని భర్తీ చేస్తామంటూ ఇచ్చిన హామీ మర్చిపోయారా జగన్ గారూ అంటూ లోకేశ్ దుయ్యబట్టారు. తుపాను అనగానే అట్నుంచి అటే హైదరాబాద్ వెళ్లిపోయిన మీరు, సిక్కోలు ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారో ఓసారి గుర్తుచేసుకోండి జగన్ గారూ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
తుపాను అంతా అయిపోయాక తీరిగ్గా వెళ్లి తిత్లీ తుపాను నష్టం రూ.3.435 కోట్లను బాధితులకే నేరుగా ఇస్తానని చెప్పారు. ఆ హామీ ఏమైందని సిక్కోలు ప్రజలు అడుగుతున్నారు జగన్ గారూ, ఆ మాట గాలికేమైనా కొట్టుకుపోయిందా?” అంటూ ఎద్దేవా చేశారు. తిత్లీ తుపాను బాధితులను జగన్ పరామర్శించిన వేళ ఇచ్చిన హామీకీ సంబంధించిన వార్త క్లిప్పింగ్ ను కూడా లోకేశ్ తన ట్వీట్ లో పోస్ట్ చేశారు.