వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఐటీ శాఖ మంత్రి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేశ్ ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ చేతిలో ఫ్యాన్ పట్టుకుని తిరుగుతున్నప్పటికీ ఆ ఫ్యాన్ మాత్రం తిరగదని ఎద్దేవా చేశారు. జగన్ ఫ్యాన్ స్విచ్ మోదీ వద్ద, రెగ్యులేటర్ తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ఉన్నాయని దుయ్యబట్టారు. సీఏం చంద్రబాబు చొరవతోనే అనంతపురం జిల్లాలో ‘కియా కార్ల పరిశ్రమ’ ఏర్పాటు అయిందన్నారు.
ప్రధాని మోదీ ఏనాడైనా ఏపీలో పరిశ్రమను ఏర్పాటు చేయాలని కియా కంపెనీకి లేఖలు రాశారా? అని ప్రశ్నించారు. కియా కంపెనీ విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ టీడీపీని గెలిపించాలని కోరారు. వైసీపీ అధినేత జగన్ ను చూస్తే తనకు జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.