ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. గురువారం గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను నారా భువనేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బే తగిలింది.
అయితే మరోవైపు టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు, నేతలు పార్టీని వీడటంతో వరుస షాక్లు తగులుతున్నాయని వ్యాఖ్యానించారు. జీవితంలో గెలుపోటములు సహజమని.. ధైర్యంగా నిలబడండి, పోరాడటం అలవర్చుకోవాలన్నారు. కార్యక్షేత్రంలోకి దిగితేనే అసలేం జరిగిందనే వాస్తవాలు తెలుస్తాయని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవడంతో అసలేం జరిగిందనే విషయాలపై ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలతో చంద్రబాబు వరుస భేటీలవుతూ సమీక్షలు చేస్తున్నారని తెలిపారు.