telugu navyamedia
సినిమా వార్తలు

“మన్మథుడు-2” వసూళ్ళపై నాగార్జున స్పందన

manmadhudu 2 movie launch

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించి, పి.కిరణ్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ హీరోయిన్‌ గా నటించింది. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రానికి వసూళ్లు బావున్నాయని నాగార్జున తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్లో సినిమాపై డివైడ్‌ టాక్‌ లేదు. ‘న్యూ ఏజ్‌ సినిమా’ తీశారని చెబుతున్నారు. కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారీ ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేయడానికి కొంత సమయం పడుతుంది. ‘గీతాంజలి’, ‘శివ’, ‘నిర్ణయం’, ‘అన్నమయ్య’, ‘మన్మథుడు’ చిత్రాలకు తొలుత అద్భుత స్పందన ఏమీ రాలేదు. నెమ్మదిగా పుంజుకున్నాయి. క్లాసిక్స్‌గా నిలిచాయి. వాటితో ‘మన్మథుడు 2’ని పోల్చను. కానీ, చివరికి ఏ సినిమాకైనా వసూళ్లే ముఖ్యం! వసూళ్లు బావుంటే నిర్మాత మరో సినిమా తీయగలడు. హీరో ముందడుగు వేయగలడు. డివైడ్‌ టాక్‌ ఉంటే ‘మన్మథుడు 2’కు వసూళ్లు ఉండవు కదా! ప్రేక్షకుల స్పందనతో నటుడిగా, వసూళ్లతో నిర్మాతగా సంతోషంగా ఉన్నా. ఫ్యామిలీ లేకపోతే ఏం చేయలేమనే సందేశాన్ని ఈ చిత్రంతో ఇచ్చాం. ఓ సక్సెస్‌ వచ్చిన తర్వాత ఎంతకాలం అదే సక్సె్‌సను పట్టుకుని వేలాడాలి? దాన్ని ఉపయోగించుకుని కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని, కొత్తగా ప్రయత్నించాలని నాన్న (ఏయన్నార్‌) గారి దగ్గర్నుంచి నేర్చుకున్నాను’’ అని నాగార్జున అన్నారు. ‘‘సినిమా కలెక్షన్స్‌ బావున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అని పి. కిరణ్‌ అన్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌తో కలిసి థియేటర్లకు వెళ్లాను. నాగార్జున గారు, ‘వెన్నెల’ కిశోర్‌ మధ్య వినోదాత్మక సన్నివేశాలు చూసి పడిపడి నవ్వుతున్నారు. అవంతిక (రకుల్‌) పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చినట్టుంది. క్లాప్స్‌ కొడుతున్నారు. క్లైమాక్స్‌ టైమ్‌లో సైలెంట్‌గా ఉన్నారు. పూర్తయ్యాక చిరునవ్వుతో బయటకొస్తున్నారు’’ అన్నారు.

Related posts