ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని చేసిన కామెంట్ టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. నాగబాబు, బాలయ్యను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా “కామెంట్ నంబర్ -5 : సామెత : “తండ్రి మాతా చార్యుడు, తనయుడు ఆచార్యుడు, తల్లి రామానుజ మతస్థురాలు ……… అల్లుడు పింజారి మరదలు మార్వాడి “. సంకర పార్టీ ఒక తోక లేదు ఒక తొండం లేదు, అలగా బలగా జనాన్ని వెంటేసుకొని తిరుగుతున్న పార్టీలను ఇపుడు చూస్తున్నాం మనం… ” అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.
టీడీపీలో అయినా, జనసేనలో అయినా ఎస్సీ, ఎస్టీ, కమ్మ, కాపు, వైశ్య కులాలకు చెందినవారు ఉంటారని నాగబాబు స్పష్టం చేశారు. “ప్రజలను సంకరజాతి మనుషులు అన్నారే… మీరు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకు ఎవరూ చెప్పలేదా? ఈ వ్యాఖ్యలపై కూడా మేం స్పందించలేదు. మీ వ్యాఖ్యలతో ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మా పార్టీలోనూ రెడ్లు, కమ్మ, కాపులు ఉన్నారు. మనసుకు బాధగా అనిపించినా మేం స్పందించలేదు” అని నాగబాబు వ్యాఖ్యానించారు. త్వరలోనే మరో వీడియోను విడుదల చేసి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు నాగబాబు.