ఇప్పుడు సోషల్ మీడియాలో “బాటిల్ క్యాప్ ఛాలెంజ్” వైరల్ అవుతోంది. కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్లు యూత్ని ఉర్రూతలూగించాయి. ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటంటే ఓ టేబుల్పై బాటిల్ను పెట్టి, దానికి కొద్ది దూరంలో నిలబడి మూతను బాటిల్ కింద పడకుండా తన్నాలి. చాలామంది ఈ ఛాలెంజ్ ను విజయవంతంగా పూర్తి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తాజాగా “మహానటి” దర్శకుడు “వన్ బకెట్ ఛాలెంజ్” చేశాడు. ప్రస్తుతం భారత భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో అనేక ప్రాంతాల ప్రజలు నీటి కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు. ఈ సమస్య రానున్న రోజులలో హైదరాబాద్కి కూడా రానుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే నీటిని ఆదా చేయడం ఒక్కటే మార్గం. అందుకే “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ కాస్త విభిన్నంగా ఆలోచించి వన్ బకెట్ ఛాలెంజ్ చేశారు. కనీసం ఒక్కరోజైనా దినచర్యలైన బ్రష్, బాత్, టాయిలెట్, హ్యాండ్ వాష్ ఇలా అన్ని అవసరాలని కేవలం ఒక్క బకెట్ నీటితో మాత్రమే తీర్చుకోవాలని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. జూలై 21 అనగా ఈ ఆదివారం కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించి మీ సామాజిక బాధ్యత నెరవేర్చమని కోరుతున్నాడు నాగ్ అశ్విన్. మరి మంచి పనికోసం నాగ్ అశ్విన్ చేసిన ఛాలెంజ్ని ఎంత మంది స్వీకరిస్తారో చూడాలి.
previous post