దక్షిణ భారత నటీనటుల (నడిగర్) సంఘ కార్యవర్గం పదవీకాలం గత ఏడాది అక్టోబరుతో ముగియడంతో వచ్చే జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ ఎన్నికల నిర్వహణపై ఆదివారం స్థానిక టి.నగర్లోని ఓ స్టార్ హోటల్లో నడిగర్ సంఘ అధ్యక్షుడు నాజర్ నేతృత్వంలో చివరి కార్యవర్గ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం విలేఖరులతో నాజర్, పొన్వన్నన్ మాట్లాడారు.
సంఘ నిబంధనల మేరకు ఎన్నికలు ప్రకటించే 21 రోజులకు ముందే కార్యవర్గసభ్యులందరికి సమాచారం తెలియజేయాల్సి ఉండగా, ఎవరు రాకపోయినా ఫర్వాలేదని ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల నిర్వహణపై చర్చించామని, ఎన్నికల తేది త్వరలో ప్రకటించడం జరుగుతుందని, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రేపటి నుంచే ఎన్నికల పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
నడిగర్ సంఘ ప్రధాన కార్యదర్శి విశాల్ షూటింగ్ కోసం టర్కీలో ఉన్నారని, అలాగే, కోశాధికారి కార్తీ కూడా షూటింగ్లో బిజీగా ఉండడంతో వారు ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారని తెలిపారు. చట్ట సమస్యలు, వర్షాల కారణంగా ఆగిన నడిగర సంఘ భవన నిర్మాణపనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. తమ పదవీకాలం ముగిసేలోపు భవన నిర్మాణపనులను పూర్తిచేయాలని, ఎన్నికలు జరిగిన అనంతరం కొత్త కార్యవర్గం పదవీ స్వీకారం జరిగిన వెంటనే భవనాన్ని ప్రారంభించాలని తీర్మానించామని వారు తెలిపారు.