దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్కకూడా చెప్పలేనన్ని తయారయ్యాయి. ఇక ఆ పార్టీలలో ఒక్కోదానిలో ఒక్కడైనా నిజాయితీ పరుడైన నాయకుడు ఉంటాడు. అయితే రాజకీయం అంటే ఉమ్మడిగా చేయాల్సిన పని, అందులో ఉన్న ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉంటేనే అనుకున్న లక్ష్యం సాధించడం వీలుంటుంది. కానీ, నిజానికి పార్టీకి ఒక్కళ్ళే అలా ఉంటున్నారు.. దీనితో లక్ష్యసాధన ఇక జరగదని ఆ ఒక్కడు కూడా రాజకీయ సన్యాసం తీసేసుకుంటున్నాడు. అంటే మిగిలిన రాక్షసులతో దేశపరిపాలన ఎలా ఉంటుందో మిరే ఊహించుకోవచ్చు. అందుకే దేశం ఇన్నేళ్ళుగా అభివృద్ధి చెందుతూనే ఉంది.
తాజాగా రాజకీయాలలో ఇమడలేక, ఉమ్మడి ఆధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంవీ మైసూరా రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు తప్పుకున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నేతగా ఉండి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. పిమ్మట వైకాపా తీర్థం పుచ్చుకుని, అక్కడ నుంచి బయటకు వచ్చేశారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. రాయలసీమ హక్కుల సాధనపై కడపలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతానని, అవసరమైతే అన్ని పార్టీలనూ కలుపుకుని పోరాడతానని చెప్పారు. రాయలసీమ హక్కుల సాధన నిమిత్తం మహాసభ నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. రాయలసీమ సమస్యల పరిష్కారానికి మాజీ సీఎస్ అజయ్ కల్లం నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు మైసూరా రెడ్డి ప్రకటించారు.