“సాహో” ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా కన్పించనుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన లుక్ లకు మంచి స్పందన లభించింది. అయితే తాజాగా “సాహో” నుంచి తప్పుకున్నట్టు సంగీత త్రయం శంకర్ – ఎహసాన్ – లాయ్ ప్రకటించారు. హీరో ప్రభాస్, దర్శకుడు సుజీత్, నిర్మాతలు వంశీ, ప్రమోద్కి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. “షేడ్స్ ఆఫ్ సాహో : ఛాప్టర్ 1″కు తమన్, రెండో వీడియోకి జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు. శంకర్ -ఎహసాన్ – లాయ్ తప్పుకోవడంతో తమన్ – జిబ్రాన్లో ఎవరో ఒకరు “సాహో”కి సంగీతం అందించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక శంకర్ – ఎహసాన్ – లాయ్ నుంచి ఈ ప్రకటన రావడానికి కొన్ని గంటల ముందు ‘సాహో’ చిత్రబృందం రెండో పోస్టర్ విడుదల చేసింది. దీంతో ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ మాట్లాడుతూ “హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నాం. ఇందులో ప్రభాస్ స్టైలిష్గా, కొత్త ఎనర్జీతో కనిపిస్తారు” అని అన్నారు.