తెలంగాణలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయవద్దని ఎస్ఈసీ సూచించింది. ప్రచారానికి సెల్ఫోన్, ఇంటర్నెట్ సైతం వాడకూడదని హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని ఎస్ఈసీ పేర్కొన్నది. ప్రచారం ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు మూసివేయాలని యాజమాన్యాలకు తెలిపింది.
ఈ నెల 22న 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఓటరు స్లిప్పులను www.tsec.gov.inలో పొందే అవకాశం ఉందని తెలిపింది. టీపోల్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటరు స్లిప్పులు పొందవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఉద్యోగులు కూడా ఓటు వేసేందుకు ముందుకు రావాలని, వారికి కంపెనీలు 3 గంటల పాటు సమయమివ్వాలని ఆయా కంపెనీలను ఆదేశించింది.