గత పరాజయం నుంచి కోలుకుని ముంబయి మళ్లీ గాడిలో పడింది.. బెంగళూరుపై స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించింది. ఐపీఎల్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో ముంబయి 5 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. మొదట బెంగళూరు 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. మలింగ (4/31) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. డివిలియర్స్ (75; 51 బంతుల్లో 6×4, 5×6) టాప్ స్కోరర్. డికాక్ (40; 26 బంతుల్లో 5×4, 2×6) రాణించడంతో లక్ష్యాన్ని ముంబయి 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
172 పరుగుల ఛేదనలో ముంబయికి ఓపెనర్లు రోహిత్ (28; 19 బంతుల్లో 2×4, 2×6), డికాక్ (40; 26 బంతుల్లో 5×4, 2×6) శుభారంభం ఇచ్చారు. ఈ జోడీ తొలి వికెట్కు 70 పరుగులు జత చేయడంతో ముంబయి విజయం దిశగా అడుగులు వేసింది. అయితే మొయిన్ అలీ (2/18) ఒకే ఓవర్లో రోహిత్, డికాక్ను ఔట్ చేసి ముంబయిని దెబ్బ కొట్టాడు. అయితే సూర్యకుమార్ (29; 23 బంతుల్లో 2×4, 1×6), ఇషాన్ కిషన్ (21; 9 బంతుల్లో 3×6) ధాటిగా ఆడడంతో ముంబయి ఒక దశలో 104/2తో లక్ష్యం దిశగా సాగింది. అయితే చాహల్ సూర్యకుమార్, ఇషాన్ను ఔట్ చేసి ముంబయి జోరుకు బ్రేకులు వేశాడు. ఈ స్థితిలో ధాటిగా ఆడిన హార్దిక్ రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమైన స్థితిలో వరుసగా 6, 4 4, 6 కొట్టి ముంబయిని విజయపథంలో నడిపించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఆరంభంలో కోహ్లి (8) వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో డివిలియర్స్, పార్థివ్ (28; 20 బంతుల్లో 4×4, 1×6)తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్ నిర్మించాడు. పార్థివ్ను పాండ్య ఔట్ చేసి బెంగళూరుకు బ్రేక్ వేశాడు. ఐతే డివిలియర్స్కు మొయిన్ అలీ (50; 32 బంతుల్లో 1×4, 5×6) జత కలవడంతో ఆర్సీబీ జోరు అందుకుంది. 19 ఓవర్లకు బెంగళూరు స్కోరు 162/4. అయితే చివరి ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన డివిలియర్స్.. రెండో బంతికి రనౌట్ కాగా… అక్షదీప్ నాథ్ (2), నేగి (0) వికెట్లను మలింగ ఖాతాలో వేసుకోవడంతో బెంగళూరు మరింత స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.
నేటి మ్యాచ్ : పంజాబ్ vs రాజస్థాన్; టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను : మంత్రి తలసాని