టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో శనివారం హైదరాబాద్ లో జరగబోయే తొలి వన్డేవన్డేలో అతడు ఆడతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఎంతోకాలంగా ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూడాలని ఆశ పడుతున్న తరుణంలో ధోనీకి గాయం కావడంతో నిరాశ తప్పేలా లేదు. ఆస్ట్రేలియాతో తొలి వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోనీ గాయపడ్డాడు.
నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. సపోర్ట్ స్టాఫ్ సభ్యుడైన రాఘవేంద్ర విసిరిన బంతి ధోనీ కుడి చేతికి బలంగా తగిలింది. దీంతో అతడు విపరీతమైన నొప్పితో బాధపడ్డాడు. అప్పటికే చాలా సేపటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ.. ఈ గాయం తగలగానే ముందు జాగ్రత్తగా నెట్స్ నుంచి వెళ్లిపోయాడు. అయితే గాయం తీవ్రత ఎంతన్నది ఇంకా తెలియలేదు. తొలి వన్డేలో అతడు ఆడతాడా లేదా అన్నది శుక్రవారం సాయంత్రంలోగా తేలనుంది.