నేడు టీడీపీ ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు చంద్రబాబు, లోకేశ్, కేశినేని నాని, భూమా అఖిలప్రియ, దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరుల్ని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. జగన్ సీఎం అయిన మరుక్షణమే టీడీపీ శ్రేణులపై దాడులు మొదలయ్యాయని అన్నారు. తమ అధినేత చంద్రబాబును, పార్టీ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం అని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటిరోజుగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. ఆత్మకూరు పునరావాస కేంద్రంలో అరవై కుటుంబాలు ఉన్నాయని, బాధితులకు ఆహారం తీసుకు వెళ్తుంటే తమ వారిని అడ్డుకుని క్రూరత్వం ప్రదర్శించారని వైసీపీ పై మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం జగన్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.ఫ్యాక్షనిస్టుల పాలనలో ఉన్నట్టు ఏపీ ప్రజలు భయపడుతున్నారని విమర్శించారు.