కశ్మీర్ విభజన బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతోందని ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ బిల్లుతో కశ్మీర్ ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. లోక్ సభలో జమ్ముకశ్మీర్ బిల్లుపై చర్చ సందర్భంగా నామా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు. కొన్ని సందర్భాల్లో చారిత్రక తప్పిదాలు జరుగుతుంటాయని… వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం వుంటుందని చెప్పారు.
జమ్ముకశ్మీర్ బిల్లుకు మద్దతు పలకకపోతే పెద్ద తప్పు చేసినవారమవుతామని, అలాంటి పార్టీలను ప్రజలు దేశ ద్రోహులుగా చూస్తారని అన్నారు. రానున్న రోజుల్లో కశ్మీర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని నామా చెప్పారు. ఐదేళ్లలో కశ్మీర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అమిత్ షా చెప్పారని, అందుకే ఈ బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నామని తెలిపారు.