తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి విరుచుకుపడ్డారు. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ఒక్క మహిళను ఓడించడానికి సీపీఐ కాళ్లు పట్టుకున్నందుకు కేసీఆర్ సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను కేసీఆర్ కొన్న విషయం సీపీఐ మర్చిపోయిందా? అని ప్రశ్నించారు.
నిరంకుశ పాలన చేస్తున్న కేసీఆర్కు వ్యతిరేకంగా తెలంగాణలో హాంకాంగ్ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఆర్ధిక మాంద్యం ఉందన్న కేసీఆర్ కొత్త సచివాలయం ఎందుకు కడుతున్నాడని ప్రశ్నించారు. సచివాలయంపై హైకోర్టు తీర్పిచ్చినా ముందుకెళ్లుండడంపై పార్టీలకతీతంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దోచుకున్న బందిపోటు దొంగలు హుజూర్నగర్పై పడ్డారని కోమటిరెడ్డి విమర్శించారు.