నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై విమర్శలు కురిపించారు. జగిత్యాలలో మీడియాతో ఆమె మాట్లాడుతూ బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడే రాముడు గుర్తొస్తాడని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో బీజేపీ సర్కార్ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. జాతీయ పార్టీలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. 71 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నామన్నారు.
మనకన్నా చిన్నదేశాలు, పేదదేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరినీ ఆకర్షిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే 24 గంటల కరెంట్ సాధ్యమైందన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరాలన్నారు. ఎంపీ కవిత సమక్షంలో పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్లారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.