telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఈటల క్షమాపణలు చెప్పాలి: మోత్కుపల్లి

దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు మోత్కుపల్లి నర్సింహులు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 40 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్న ఈటలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఈటలను హుజురాబాద్‌లో ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన మోత్కుపల్లి.. ఈటల బావమరిది దళితులను బూతులు తిట్టడం సరికాదని, ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ఈటలను ప్రజలు నమ్మొద్దని కోరారు. ఇక, ఈటల ఆక్రమించిన దళితుల భూముల్లో జెండాలు పాతుతామని ప్రకటించిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దళిత బంధుకు మద్దతుగా ప్రచారం చేస్తా.. ఈటల మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానన్నారు. ఇప్పటికైనా దళితుల భూమిని ఈటల వాపస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్‌ కుటుంబ సభ్యులపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అసభ్య పదజాలంతో దూషించిన ఈటల కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈటల బావమరిది వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈటెల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

మరోవైపు.. దళిత బంధును అడ్డుకోవడం సరికాదన్నారు మోత్కుపల్లి. సీఎం కేసీఆర్ ను అందరూ బలపర్చాలని విజ్ఞప్తి చేసిన ఆయన ఈ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి గ్రామాల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సమసమాజ స్థాపన జరగాలి.. ఒక దళితునికి పది లక్షల ఇస్తానని చెప్పిన దేశంలో ఏకైక మొనగాడు కేసీఆరే అన్నారు. ఇక, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన ఆయన.. దళిత పథకాలకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. రైతుబంధులాగా దళిత బంధు మంచి పథకం అని ప్రశంసలు కురిపించారు. అట్టడుగు వర్గాల వారికి ఈ పథకం అన్ని రకాలుగా ఉపయోగ పడుతుందన్న మోత్కుపల్లి.. అన్ని రాజకీయ పార్టీలు దళిత బంధును స్వాగతించాలని కోరారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కేసీఆర్ కు ఒక్కరికే ఉందన్న ఆయన.. జాతీయ పార్టీలు ఇలాంటి పథకాలు తీసుకు వచ్చే అవకాశమే లేదన్నారు.

Related posts