ప్రపంచవ్యాప్తంగా షార్కు చేపల దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య కంటే ఐదురెట్లు సెల్ఫీ తీసుకోబోయి మృత్యువాత పడినవారి సంఖ్య ఎక్కువగా ఉందని భారత్కు చెందిన ‘‘ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్’’ జర్నల్ పేర్కొంది. అక్టోబరు 2011 నుంచి నవంబరు 2017 మధ్య సెల్ఫీలు తీసుకుంటూ 259 మంది చనిపోతే, ఇందులో 159 మంది మనదేశంవారే కావడం గమనార్హం. ఇదేకాలంలో రష్యాలో 16 మంది, అమెరికాలో 14 మంది దుర్మరణం చెందారు.
మహిళలు ఎక్కువ సెల్ఫీలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కుర్రకారు సాహసంతో కూడిన చిత్రాలకు ఫోజులెక్కువ ఇస్తున్నారు. నీటిలో మునిగిపోవడం, వాహనాలు గుద్దుకోవడం, ఎత్తైన స్థలాల నుంచి పడిపోవడం, వీడియో చిత్రీకరణలో నిమగ్నమై ఉండగా జరుగుతున్న ప్రమాదాలు నాలుగింట మూడొంతుల మరణాలకు కారణమవుతున్నాయి. సెల్ఫీల మోజులో ప్రాణాలు కోల్పోతుండడంతో ముంబయిలో సెల్ఫీలు తీసుకోకూడని చోటుగా 16 ప్రాంతాలను ప్రభుత్వం ప్రకటించించడం విశేషం.