telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

హెరిటేజ్ ఫుడ్స్ లో నేను బాగస్తుడినే.. మోసంతో తప్పించారు .. : మోహన్ బాబు

mohan babu fire on chandrababu

నటుడు మోహన్ బాబు నేడు మరోసారి చంద్రబాబు పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ, హెరిటేజ్ ఫుడ్స్ వ్యవస్థాపకుల్లో తాను కూడా ఉన్నానని, తన వద్ద నుంచి బ్లాంక్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్న చంద్రబాబు, తన వాటాను కొట్టేశారని సంచలన ఆరోపణలు చేశారు. తాను, చంద్రబాబు, దాగా అనే మరో మిత్రుడు కలిసి హెరిటేజ్ ని స్థాపించామని చెప్పిన మోహన్ బాబు, అధిక పెట్టుబడి తనదేనని, మిగతా ఇద్దరూ తక్కువ పెట్టుబడి పెట్టారని అన్నారు. కొన్ని రోజుల తరువాత తెల్లకాగితాలపై సంతకాలు చేయమని అడిగారని, ఎందుకని ప్రశ్నిస్తే, అప్పట్లో ఏదో చెప్పారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో హీరోగా టాప్ పొజిషన్ లో ఉన్న తాను, చాలా బిజీగా ఉన్నానని, స్నేహితుడే కదా అని చంద్రబాబును నమ్మి సంతకాలు చేశానని అన్నారు.

నాకు హెరిటేజ్ సంస్థతో సంబంధం లేదని కొన్నేళ్ల తరువాత చెప్పారని, ఈ విషయంలో తాను కోర్టుకు వెళితే, కేసు ఎంతోకాలం సాగిందని గుర్తు చేశారు. పరపతి ఉన్న చంద్రబాబును తట్టుకోలేమని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు చెబితే, కేసును వదిలేశానని అన్నారు. తాను బయటకు వచ్చిన తరువాత దాగాను కూడా మోసం చేసి తరిమేశారని ఆరోపించారు. ఈ కంపెనీ విషయంలో చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారని, రైతులకు తెలియకుండా వారి పేరిట హెరిటేజ్ లో వాటాలు కొని, వాటిని చంద్రబాబుకే అమకమినట్టు చూపించి ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టారని ఆరోపించారు. తనను మోసం హెరిటేజ్ నుంచి తరిమేశారన్న విషయాన్ని తిరుపతి, కాణిపాకం, విజయవాడ… ఎక్కడికి వచ్చి అయినా, ఒట్టేసి చెప్పగలనని, మోసం చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అని మోహన్ బాబు ప్రశ్నించారు.

Related posts