telugu navyamedia
సినిమా వార్తలు

జైలు శిక్షపై స్పందించిన మోహన్ బాబు

mohanbabu fires on ap govt for reimbursement

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబుకు హైదరాబాదు ఎర్రమంజిల్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షను, రూ. 41.75 లక్షల జరిమానాను విధించింది. సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి 2010లో మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. ప్రస్తుతం మోహన్ బాబుకు జైలు శిక్ష పడిందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు. “కొన్ని టీవీ చానళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇప్పుడే విన్నా. నేను నా ఇంట్లోనే ఉన్నా” అంటూ ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే… మంచు విష్ణు, ఇలియానా హీరోహీరోయిన్లుగా మోహన్ బాబు కీలక పాత్రలో 2009లో ‘సలీం’ సినిమా రూపొందింది. వైవిఎస్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు వహించగా.. మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. 2009 డిసంబర్ 11న ఈ సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు గాను రెమ్యునరేషన్ గా వైవిఎస్ కి నలభై ఐదు లక్షల యాభై వేల రూపాయలకు మోహన్ బాబు చెక్ రాసిచ్చారు. అయితే సినిమా రిలీజ్ అయిన తరువాతే డబ్బు తీసుకోవాలని చెప్పడంతో వైవిఎస్ సినిమా రిలీజ్ అయిన తరువాత బ్యాంక్ ని సంప్రదించాడు. అక్కడి అధికారులు ఈ చెక్ నెంబర్ ని బ్లాక్ చేసినట్లు అమౌంట్ ఇవ్వడానికి కుదరదని చెప్పడంతో వైవిఎస్ దర్శకుల సంఘాన్ని ఆశ్రయించాడు.

‘సలీం’ సినిమా ఘోర పరాజయం కావడంతో వైవిఎస్ కి, మోహన్ బాబుకి మధ్య మాటల యుద్ధం జరిగింది. రూ.10 కోట్ల రెమ్యునరేషన్ లో సినిమా తీస్తానని చెప్పి వైవిఎస్ రూ.25 కోట్ల బడ్జెట్ చేశాడని అప్పట్లో మోహన్ బాబు ఆరోపించారు. పరోక్షంగా పదిహేను కోట్లు వైవిఎస్ తన జేబులో వేసుకున్నాడని అన్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు వైవిఎస్ కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఆపేశాడు. దీనిపై మోహన్ బాబుకి వైవిఎస్ లెటర్ కూడా రాశాడు. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ చెల్లించమని కోరారు. కానీ దాన్ని మోహన్ బాబు పట్టించుకోకపోవడంతో అతడు దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేయగా… వారు దాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి పాస్ చేశారు. అక్కడ సరైన న్యాయం జరగపోవడంతో వైవిఎస్ కోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్షను, రూ.41.75 లక్షల జరిమానా కూడా విధిస్తూ ఈరోజు తీర్పుని వెలువరించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

Related posts