అశ్రువులను చెక్కిలిపై ఆరబోస్తేనే కదా
అవి మంచుముత్యాల్లా మెరిసిపోయేది
కన్నీళ్లు కనిపించని బాధల గుర్తులు
గడ్డకట్టిన దుఃఖాన్ని ఒంపుకుంటేనే కదా
మనసంతా తేలికయై ఊయలలూగేది
దుఃఖం మనిషిని సాంత్వనపరిచే ఓదార్పు
మనిషి స్వార్ధచింతనను విడనాడితేనే కదా
లోకమంతా మానవతా వెలుగులు నిండేది
స్వార్థం మనిషిని చుట్టుముట్టే విషాదగీతం
మనిషి ఎదలోతుల్ని చూడగలిగితేనే కదా
అలజడుల తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడేది
మనిషి అంతరంగం ఆటుపోట్ల సంగమం
గాయపడిన గుండెను తడిమితేనే కదా
బాధలు దుఃఖసముద్రమై చెలియలికట్ట దాటేది
గాయాలు మనిషిని మనీషిగా మార్చే శిల్పాలు
– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్