రెండోసారి దేశ ప్రధానిగా మోదీ.. తిరుపతికి వస్తున్నారు. దీనితో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం తిరుమల వచ్చిన మోదీ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని ఆ ఏడుకొండల వాడి సాక్షిగా హామీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే.. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ తిరుగులేని ప్రభంజనం సృష్టించారు. మోజార్టీ సీట్లతో గెలిచిన మోదీ.. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్లు గడిచిపోయాయి.. కానీ ఆ ఏడుకొండలవాడి సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైందని.. వివిధ రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈసారైనా హోదాపై మోదీ తిరుపతి సాక్షిగా ఏమైనా కీలక ప్రకటన చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే మోదీ తిరుపతికి వస్తుండటంతో బీజేపీ శ్రేణులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మోదీ తిరుపతి టూర్ నేపథ్యంలో.. ఆయన్ను కలిసేందుకు సీఎం జగన్ కూడా తిరుపతికి వెళ్లనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది. ఈ నెల 15న ఢిల్లీకి వెళ్లి నీతి ఆయోగ్ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.