ప్రధాని మోదీకి రష్యాలో ఘన స్వాగతం లభించింది. రష్యా తూర్పు తీరంలోని అత్యంత సుదూర ప్రాంతానికి వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. ద్వైపాక్షిక సమావేశాల కోసం మోదీ రష్యాకు వెళ్లడం ఇది మూడోసారి. ఈ పర్యటనలో తూర్పు దేశాల ఆర్థిక సదస్సుతోపాటు భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో మోదీ పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కీలక భేటీ జరగనుంది. మొత్తం 25 ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతకుముందు తన రష్యా పర్యటనపై మోదీ ట్విటర్ వేదికగా పలు అంశాలను పంచుకున్నారు. ఈ పర్యటనలో పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయని వెల్లడించారు.
ఈ పర్యటనతో రష్యాతో ఉన్న సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సదస్సులో పాల్గొననున్న ఇతర దేశాల ప్రతినిధులతోనూ వాణిజ్యపరమైన చర్చలు ఉంటాయని తెలిపారు. అధికరణ 370 రద్దు విషయంలో భారత్కు రష్యా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత విషయమని.. అది రాజ్యాంగబద్ధంగానే జరిగినట్లు భావిస్తున్నామని ప్రకటించారు. అలాగే కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుపై అంతర్జాతీయ మద్దతు కోసం పాక్ విఫలయత్నాలు చేస్తున్న వేళ మోదీ-పుతిన్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.