జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడు అంటూ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని లేపాయి. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పిగా మారినట్టు స్పష్టమవుతోంది. ఆమె వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఖండించగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రజ్ఞా సింగ్ పై సీరియస్ అయ్యారు. బాపూని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ను ఎన్నటికీ క్షమించలేనని మోదీ పేర్కొన్నారు.
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కు భోపాల్ లోక్ సభ టికెట్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడగా, అప్పట్లో మోదీనే ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడాయనే ప్రజ్ఞా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని తెలిపిన ప్రధాని, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా ఖండించాల్సిందేనని అన్నారు. తన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.