telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సరిహద్దులో ఉద్రిక్తత : ప్రధాని అత్యవసర సమావేశం.. !

Modi Imran Khan

అభినందన్ విడుదలతో ఓటమికి గురైనట్టు పాక్ భావిస్తుంది. దీనితో కుటిల రాజకీయాలు నెరపుతూ, సరిహద్దులలో కాల్పుల విరమణ కు తిలోదకాలు; సమీప గ్రామాలపై పాక్ దాడులు జరుపుతూనే ఉంది. దీనితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్టుగానే భావిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) ఆదివారం రాత్రి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ధోవల్ ప్రధాని మోదీకి వివరించారు.

సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్.. రాత్రివేళ దీపాలు వెలిగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాణస్కంత జిల్లాలోని జలోయ, మావసారి, శివనగర్, మేఘపుర, రండోసాన్ గ్రామాల ప్రజలకు ఈ హెచ్చరికలు చేసింది. బీఎస్ఎఫ్ ఆదేశాలతో ఆయా గ్రామాలు రాత్రివేళ చిమ్మచీకటిలో గడుపుతున్నాయి. భద్రతా దళాల ఆదేశంతో గ్రామాల్లో విద్యుత్ దీపాలను ఆర్పివేసినట్టు రండోసాన్ గ్రామ సర్పంచ్ దిలీప్ సిన్హా చౌహాన్ తెలిపారు. గ్రామంలో లైట్లు వెలిగి ఉంటే పాక్ దళాలు దాడికి తెగబడే అవకాశం ఉందని సిన్హా పేర్కొన్నారు.

కాశ్మీర్ లో ఉగ్రదాడి అనంతరం పాక్ భూభాగంలో భారత వాయుసేన నిర్వహించిన మెరుపు దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు దొరికిన భారత పైలట్ అభినందన్‌ను ఇమ్రాన్ ప్రభుత్వం విడిచిపెట్టినప్పటికీ పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాని ఎన్ఎస్‌సీ సమావేశం నిర్వహించడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.

Related posts