తాత్కాలిక బడ్జెట్ అనంతరం బీజేపీ ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేసేందుకు దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మొదటిగా ఏపీలో పర్యటించారు. అనంతరం మోడీ ప్రచార రాష్ట్రంగా కర్ణాటక తెరపైకి వచ్చింది. ప్రచార తేదీలు కూడా ఖరారు చేశారు. ఈ నెలలోనే 10వ తేదీ నుండి ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని హుబ్బళికి రానున్నారు. కర్ణాటకలో హుబ్బళి బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చెయ్యాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.
ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం చెయ్యడానికి తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ మీడియాకు చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ధారవాడ, హావేరి, గదగ్, ఉత్తర కన్నడ లోక్ సభ నియోజక వర్గాల కార్యకర్తలు పాల్గోంటారని ఆర్. అశోక్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు కర్ణాటకలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ హాజరౌతారని ఆర్, అశోక్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలు విజయవంతం చెయ్యడానికి ఇప్పటికే 30 కమిటీలు ఏర్పాటు చేశామని ఆర్. అశోక్ వివరించారు.
ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 19వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో బహిరంగ సభలు నిర్వహిస్తారని, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 21 బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో జరిగే బహిరంగ సభలకు హాజరౌతారని ఆర్. అశోక్ వివరించారు. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో కనీసం 22 నియోజక వర్గాలను కైవసం చేసుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.