telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపికి కేంద్రం మరో వంచన… ఎంతో ఆశ పెట్టుకున్న ప్రాజెక్ట్ ని, మహారాష్ట్ర తరలించారు…

INS Virat FlagShip

విశాఖపట్నం వస్తుందని భావించిన అతిపెద్ద యుద్ధ విమాన వాహకనౌక ఐఎన్‌ఎ్‌స విరాట్‌ను మహారాష్ట్ర తన్నుకుపోయింది. దీంతో రాష్ట్రం ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది. దీన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా మలచాలని సీఎం చంద్రబాబు ఎంతో ప్రయత్నించారు. ఢిల్లీకి వెళ్లినపుడల్లా రక్షణశాఖ అధికారులతో దీనిపై చర్చిస్తూనే ఉన్నారు. విశాఖ సాగరతీరంలో ఫ్లోటింగ్‌ హోటల్‌గా మార్చాలనుకున్నారు. అంతపెద్ద నౌకను తీరానికి చేర్చడం కష్టమైన పని కాబట్టి, నీటిలోనే ఉంచాలని నిర్ణయించారు. భీమిలిలో 500ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారు. సుమారు రూ.వేయి కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ రూపొందించారు. 2016 ప్రథమార్ధం నుంచి విరాట్‌ ఏపి వచ్చేస్తుంది అంటూ ఊరించారు. అదిగో ఇదిగో అంటూ కేంద్రం నాన్చుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కేవలం మూడు నెలల క్రితం ‘విరాట్‌ మాకు కావాలి’ అంటూ మహారాష్ట్ర ప్రతిపాదన పంపింది. కేంద్రం అటువైపే మొగ్గు చూపింది.

అయితే గత కొన్ని రోజులుగా ఇది మహారాష్ట్రకు వెళ్ళిపోతుంది అనే ప్రచారం జరిగినా, చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కన్ని నిన్నటితో ఆ ఆశలు పోయాయి. కేంద్రం, మహారాష్ట్రలో ఒకే పార్టీ అధికారంలో ఉండడం, కేంద్రం-ఏపీ మధ్య నెలకొన్న రాజకీయ అంతరం, తదితర పరిణామాలు నేపథ్యంలో నౌక మహారాష్ట్రకే దక్కిందనే వాదన వినిపిస్తోంది. 2016 ఫిబ్రవరిలో రాష్ట్ర పర్యాటకశాఖ నిర్వహించిన సమావేశంలో, కేంద్రం మనకు ఇవ్వటానికి సమ్మతించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. 2017 జూన్‌లో విరాట్‌ను డీ కమిషన్‌ చేశారు…కానీ, ఏపీకి కేటాయిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. తర్వాత ముఖ్యమంత్రి కేంద్రానికి, రక్షణశాఖకు రెండుసార్లు లేఖలు రాసారు. అయితే మారిన రాజకీయ పరిస్థుతుల్లో, ఏపి మరో మొండిచెయ్యి ఇచ్చింది కేంద్రం.

విరాట్‌కు ఏ యుద్ధనౌకకు లేని చరిత్ర వుంది. ప్రపంచంలో ఎక్కువ కాలం సేవలందించినది ఇదే. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 1959 నుంచి 1980 వరకు ‘హెచ్ ఎంఎస్ హెర్మస్‌’ పేరుతో పనిచేసింది. వారి నుంచి 650 లక్షల డాలర్లకు కొనుగోలు చేసి, 12 మార్చి 1987న భారత నౌకాదళంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు విరామం లేకుండా సేవలు అందించింది. దేశంలో డీ కమిషనింగ్‌ జరిగిన యుద్ధ విమాన వాహక నౌకల్లో మొదటిది విక్రాంత కాగా రెండోది విరాట్‌. ప్రతి యుద్ధనౌకకు ఒక నినాదం ఉంటుంది. విరాట్‌ నినాదం మాత్రం చాలా శక్తిమంతంగా, స్ఫూర్తినిచ్చేదిగా ఉంటుందని నేవీ అధికారులు చెబుతున్నారు. ‘జలమేవ యశ్యే…బలమేవ తశ్యే’’ అనే నినాదం విరాట్‌పై ఉంటుంది. అంటే… సముద్రాన్ని శాసించేవారే శక్తివంతులు అనేది దాని అర్థం. ఆ విధంగానే విరాట్‌ పనిచేసింది.

Related posts