మొబైల్ పిచ్చి ఉండవచ్చుగాని, దానికోసం దొంగతనం చేసి మరీ ఆరాటపడటం అంటే.. ఈ బడుద్ధాయిలు కూడా అలాంటి పనే చేశారు. దర్జాగా ఆఫీసర్లలా బొలేరో వాహనంలో వచ్చారు. ముఖాలకు ముసుగు కట్టుకుని ఓ సెల్ఫోన్ దుకాణం తలుపులు బలవంతంగా తెరిచి ప్రవేశించారు. ఆ తర్వాత మరో దుకాణంలోకి ప్రవేశించారు. రెండింటిలోని దాదాపు కోటి రూపాయల విలువైన ఫోన్లను మూటకట్టుకుని ఎత్తుకు వెళ్లారు.
జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని షాపుల్లో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల యావర్ రోడ్డులో భవాని లాట్ మొబైల్ దుకాణాలున్నాయి. వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు వీటిలోకి ప్రవేశించి ఫోన్లను అపహరించారు. అనంతరం మరికొన్ని షాపులలోనూ చోరీకి విఫల యత్నం చేసినా ఫలించక పోవడంతో వెనుదిరిగారు. దుండగులు దొంగతనానికి ఎలా పాల్పడిందీ సీసీ టీవీలలో రికార్డయి ఉంది. ఈ దొంగతనం స్థానికేతరుల పనేనని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలపడం విశేషం.