రైతుల పొలాల దగ్గరకే ఏటీఎం వాహనాల రావడం రామనగరం(ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం)లో ఏడాది క్రితం మొదలయింది. బ్యాంకులు లేని చోట బ్యాంకింగ్ రంగ సేవల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఎటీఎంలు, ప్రజల చేతుల్లో క్రిడెట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్… ఇలా ఎన్నెన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, భారతదేశంలో 41 శాతం మందికి బ్యాంకుల సేవలు అందుబాటులో లేవు. ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులను ప్రజలకు చేరువ చేయడానికి, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల్లో భాగంగా, ఎటీఎం కార్డుల వినియోగం, రుణాలు పొందడం, ఫిక్సిడ్ డిపాజిట్లు వంటి భిన్న అంశాలపై తెలంగాణ జిల్లాసహకార బ్యాంకులు ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని బ్యాంకులకు అనుసంధానం చేయడంతో, తెలంగాణ లో బ్యాంకుల ప్రాధాన్యత పెరిగింది. దీని తో గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు సేవలు విస్త్రతం చేయడానికి జిల్లాసహకార బ్యాంకులు నాబార్డ్ సహకారంతో ప్రతీ జిల్లాకు, ఏటీఎం వ్యాన్ను సమకూర్చుకున్నాయి. ఈ సేవలు నడవలేని వద్ధులు, దివ్యాంగులకు ఆసరాగా ఉంది. కదల లేని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మొబైల్ ఏటీఎంలు వారి వద్దకే వెళ్లి, సేవలందిస్తున్నారు.
డబ్బులు అవసరమైనపుడు సత్తుపల్లి వరకు పోవాల్సి వచ్చేది. అంత దూరం పోయే ఓపిక లేక కొందరు వడ్డీకి అప్పు చేసేవారు. ఇపుడు ఏటీఎంలు మా ఇంటి ముందుకే వస్తున్నాయి. అవసరమైన వారు కార్డు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు’ అంటున్నారు, రామనగరం సర్పంచ్, వేల్పుల కళావతి. ప్రజలకు చేరువలో గ్రామీణ ప్రాంతాల బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి డిసీసీబీ బ్యాంకులు గ్రామాల్లో మొబైల్ ఏటీఎంలను నడుపుతున్నారు. ఒక్కొక్క వాహనం కోసం నాబార్డు రూ.15లక్షలు గ్రాంట్ మంజూరు చేసింది. ప్రజలకు బ్యాంకుల సేవలను వివరించి, ఆర్థిక అక్షరాస్యతను పెంచుతున్నాము అని ఖమ్మం జిల్లా నాబార్డు అధికారి రావు అన్నారు.