లోక్సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్హాసన్ తమిళనాడులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు కోయంబత్తూరు, ఈరోడ్ జిల్లాల్లో పర్యటన నిర్వహించారు. బుధవారం ఈరోడ్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 40 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు.
ఎన్నికల్లో పొత్తుల పై కమల్ స్పందించారు. రాష్ట్రంలోని కొన్ని పార్టీలు గెలుపుపై అతి విశ్వాసంతో ఉన్నాయని విమర్శించారు. అన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేయడం ద్వారా ఆ పార్టీలకు షాక్ ఇస్తామన్నారు. పార్టీని ప్రారంభించినప్పుడు జెండా, అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కనీసం ఐదేళ్లు అయినా పడుతుందని అనుకున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ప్రజల స్పందన చూస్తే ఏడాదికే అందరికి చేరువ అయ్యామని తెలిసిందన్నారు.