telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నేడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్.. 4 గంటలవరకు పోలింగ్..

mlc poling in telangana today for 3

నేడు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడుస్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్‌కు సర్వం సిద్ధమయింది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్ శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎమ్మెల్సీగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అదేవిధంగా పార్టీ మారిన కారణంతో వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీ రాజీనామాచేశారు. ఖాళీ అయిన ఈ మూడుస్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మే7న నోటిఫికేషన్ జారీచేసింది. షెడ్యూల్ ప్రకా రం శుక్రవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓట్ల లెక్కింపు జూన్ 3న జరుగుతుంది. గెలిచిన ఎమ్మెల్సీలు 2022జనవరి 4 వరకు పదవిలో ఉండనున్నారు.

మొత్తం మూడు నియోజక వర్గాలలో కలిపి 2,799 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,086 మంది ఓటర్లుండగా.. వరంగల్‌లో 902, రంగారెడ్డిలో 811 మంది ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. జెడ్పీటీసీలు ఉమ్మడి జిల్లా జెడ్పీ కార్యాలయాల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎంపీటీసీ సభ్యుల కోసం ఐదారు మండలాలకు ఒక పోలింగ్‌కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. పోలింగ్ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, సామగ్రితో పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు.

మూడుస్థానాల కోసం 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానానికి మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీచేస్తుండగా.. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు.

Related posts