తెలంగాణ రాష్ట్రంలో పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ప్రక్రియ మొదలైంది. వీరి పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 28 వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం మార్చి 5న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మార్చి 12న పోలింగ్తోపాటు ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అదేరోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు. నామినేషన్ల దాఖలు గడువుకు ఒకటిరెండు రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న మహమ్మద్ మహమూద్అలీ(టీఆర్ఎస్), మహ్మద్ సలీం (టీఆర్ఎస్), తిరువరంగం సంతోష్కుమార్ (టీఆర్ఎస్), మహమ్మద్ షబ్బీర్అలీ(కాంగ్రెస్), పొంగులేటి సుధాకర్రెడ్డి (కాంగ్రెస్) పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది. ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
జగన్ వి ఒంటెద్దు పోకడలు: పురందేశ్వరి