తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికలను బహిష్కరించడంతో నలుగురు టీఆర్ఎస్, ఒక మజ్లిస్ అభ్యర్థుల గెలుపు ఖాయంగా మారింది. టీఆర్ఎస్ నుంచి హోం మంత్రి మహమూద్ అలీ మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం టీఆర్ఎస్ నుంచి గెలుపొందగా మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండి మజ్లిస్ నుంచి తొలిసారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఎన్నికలను బహిష్కరించడంతో ఒక్కో అభ్యర్థి గెలుపునకు కావాల్సిన ప్రథమ ప్రాధాన్య ఓట్లు 16కు పరిమితం అయ్యాయి. మంగళవారం జరిగిన పోలింగ్లో మొత్తం 98 మంది పాల్గొన్నారు. వారు వేసిన ఓట్లన్నీ చెల్లుబాటు అయ్యాయి. వాటిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశంకు ప్రథమ ప్రాధాన్య ఓట్లు 20 చొప్పున రాగా శేరి సుభాష్ రెడ్డి, ఎఫెండికి 19 చొప్పున వచ్చాయి. దాంతో వారు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.