కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఏపీలో, అప్పుడు ఉమ్మడి ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబేనని చెప్పారు. బంధాలు, బంధుత్వాల గురించి చంద్రబాబుకు ఏం తెలుసునని విమర్శించారు. ఏపీలో కచ్చితంగా రాజకీయాలు చేస్తామని చెప్పారు. మేము చెబితే వినే నాయకులు ఏపీలో ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు.
చంద్రబాబు మళ్లీ వద్దు అని ఏపీ ప్రజలు తనకు చెప్పారని తెలిపారు. ఏపీ రాష్ట్రంలో తాను చాలా జిల్లాల్లో పర్యటించనున్నట్టు చెప్పారు. చంద్రబాబునాయుడు హెచ్చరిస్తే ఆ పార్టీలో బీసీలు ఎవరూ కూడ ఉండరని చెప్పారు. మొన్న దుర్గగుడి ఆలయంలో మీడియా పాయింట్ వద్దే తాను మాట్లాడానని తలసాని చెప్పారు. అంతకంటే ఎక్కువగా రాజకీయాల గురించి మాట్లాడుతానని తలసాని స్పష్టం చేశారు. ఏపీలోని తమ కమ్యూనిటీ నేతలతో పాటు బీసీ సామాజిక వర్గాలకు కూడ ఈ విషయాన్ని చెబుతానని తలసాని హెచ్చరించారు. ఏపీ ఎన్నికల్లో మా ప్రమేయం ఉంటుందని చెప్పారు.