ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుతోనే ఆర్థిక మాంద్యం వచ్చిందని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అగ్రశ్రేణి ఉన్న తెలంగాణను కేసీఆర్ ఆర్థిక మాంద్యం దిశగా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. దాన్ని కేంద్రం మీదకు రుద్దుతున్నారని దుయ్యబట్టారు. .గత ప్రభుత్వాలు మిగిల్చిన సంపదను ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్లు అని ముఖ్యమంత్రి విమర్శించారని..ఆయన ఎంతమందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారో సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. కేసీఆర్ కోతల బడ్జెట్ను ప్రవేశపెట్టారని ఉన్న నిధులన్నీ ఖర్చుపెట్టి..నేడు భూములు అమ్ముతానంటూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఖజానా ఖాళీ అయితే నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాలెందుకని ప్రశ్నించారు. ఒక్క కొత్త గురుకుల భవనం కూడా కేటాయించాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.