వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వలస వస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అలా వచ్చే ప్రతీ ఒక్కరు తమ పదవులకు రాజీనామా చేయడం జగన్ నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు చంద్రబాబు మాత్రం వైఎస్సార్ సీపీ నుంచి చేరిన వారి చేత రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. గతంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్ కారణంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాదుల చర్యకు ఇప్పుడు ప్రధాని మోదీని రాజీనామా చేయమంటున్న బాబు… ఆనాడు 30 మంది ప్రాణాలు బలిగొని తానెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మీటింగ్ కోసం ఓ రైతును దారుణంగా కొట్టి చంపారని రోజా ఆరోపించారు.