తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పదిరోజుల్లో కాంగ్రెస్ ను వీడనున్న రాజగోపాల్ రెడ్డి వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప మరెవ్వరూ ఉండరని అన్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమని ఆరోపించారు. అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.
రెండుసార్లు గెలిపించిన ప్రజలకు తాను న్యాయం చేయలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో ఇరవై ఏళ్లు అధికారంలోకి రావడం కల్లేనని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. తెలంగాణలో బీజేపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదాను కాపాడుకోలేని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు నోటీసులు ఇవ్వడమేంటని ఎద్దేవా చేశారు.
బీజేపీలో టీడీపీ విలీనం చెందిందన్నది వట్టిదే: గల్లా జయదేవ్