గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కొడలైనా సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలను భారత ప్రజలు కోరుకోవడం లేదని, ఈ తరుణంలో పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణ ప్రచారకర్తగా తీసేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
సానియా మీర్జా బదులు తెలంగాణ బిడ్డలైన పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి మంచి క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని రాజాసింగ్ కోరారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్మాలిక్ను పెళ్లి చేసుకున్నందుకు ఆమెకు ఇబ్బందులు తప్పడం లేదు. భారత్-పాక్ మధ్య ఏ వివాదం చెలరేగినా భారత నెటిజన్లు సానియాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం రాజాసింగ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.