ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ను ఎందుకు దాచి పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. డేటా లీక్ వ్యవహారం పై ఆయన ఈరోజు హైదరాబాద్లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ను విచారిస్తే అన్నీ విషయాలు బయటకొస్తాయని పేర్కొన్నారు. ఫామ్ 7 అప్లయ్ చేయడం నేరం కాదని ఎన్నికల సంఘం అధికారులే చెబుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకింత కంగారు పడుతున్నారని బుగ్గాన ప్రశ్నించారు.
ఫారం-7పై హడావుడిగా రెండు సిట్లు ఎందుకు వేశారు? అని ప్రశ్నించారు. డేటా చోరీపై చంద్రబాబు ఇంతవరకు స్పష్టమైన సమాధానం చెప్పలేదని ఆరోపించారు. నకిలీ ఓట్లను తొలగించమనే ఫారం-7 అప్లోడ్ చేశామన్నారు. అందులో టీడీపీకి ఉన్న అభ్యంతరం ఏమిటి? అని అడిగారు. సేవామిత్ర యాప్తో చంద్రబాబు నిండా మునిగిపోయారని.. ఆ కేసును డైవర్ట్ చేయడానికి ఫామ్ 7పై 300కు పైగా కేసులు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. ఈ తతంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నికల సంఘం నెరవేర్చాల్సిన బాధ్యతను కూడా టీడీపీ తీసుకుందేమోనని ఆయన దుయ్యబట్టారు.