తెలంగాణ ఇంటర్ ఫలితాల గందరగోళం పై చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల వెల్లడిలో టెక్నికల్ సమస్య వచ్చింది నిజమేనని అంగీకరించారు. ఫలితాల వివాదంలో ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని సుమన్ అన్నారు. సున్నితమైన అంశంపై విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయంటూ మండిపడ్డారు.
ఇంటర్ బోర్డులో కొంతమంది అధికారుల మధ్య విభేదాల కారణంగానే గందరగోళం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇందుకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఇంటర్ బోర్డు వ్యవహారం గురించి సీఎం కేసీఆర్ అధికారులతో మాట్లాడుతున్నారని, బాధ్యులపై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.