ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, నటీనటుల కడసారి చూపు కోసం గురువారం మధ్యాహ్నం ఫిల్మ్ఛాంబర్కు తీసుకొచ్చారు. వేణుమాధవ్ భౌతిక కాయానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నటుడు వేణుమాధవ్ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. చిన్న వయసు నుంచే మిమిక్రీ చేస్తూ.. అందరినీ ఉత్సాహపరిచేవాడని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ గొంతు కూడా అనుకరించేవాడని అన్నారు.
వేణుమాధవ్ షూటింగ్లో ఉన్నాడంటే అక్కడంతా సందడే సందడిగా ఉండేదని, అందరినీ నవ్వించేవాడని అన్నారు. తక్కువ సమయంలో ఇన్ని సినిమాల్లో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదని మంత్రి పేర్కొన్నారు. స్వయంకృషి, పట్టుదల ఉన్న వ్యక్తని కొనియాడారు. ఏదిఏమైనా విధిని మనం మార్చలేమన్నారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు మంత్రి తలసాని చెప్పారు.