లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు దాతలు చేస్తోన్న సాయం అభినందనీయమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరులో చేతి వృత్తుల కుటుంబాలకు ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 7 కల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా ఉండదని అన్నారు. కరోనా కట్టడి కోసం శ్రమిస్తోన్న స్థానిక అధికారులు, ఆయా శాఖల సిబ్బందికి పువ్వాడ పూలాభిషేకం చేశారు.
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న ఇక్కడి ప్రజలకు సండ్ర అండగా ఉంటూ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా విజృంభణతో ఏర్పడే సమస్యలను సీఎం కేసీఆర్ ముందుగానే అంచనా వేసి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.