జడ్జీలను మార్చి జగన్ కేసుల విచారణ మొదటికి తీసుకొచ్చారని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఈరోజు ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. అవినీతి పరులను 100 రోజుల్లో జైలులో పెడుతానని మోదీ చెప్పారని, కానీ ఇంకా జగన్ బయటనే ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. మరో 75 రోజుల్లో ప్రధాని మోదీ ఇంటికి వెళతారని జోస్యం చెప్పారు.
అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని తెలిపారు. మోదీ ఏపీకి వచ్చి 24 గంటలైనా జగన్ ఎందుకు స్పందించలేదని లోకేశ్ ప్రశ్నించారు. మోదీ సభలకు ఇబ్బంది వస్తే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మోదీ సభను వియవంతం చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైసీపీ పెద్దలు కార్యకర్తలకు చెప్పారని లోకేశ్ ఆరోపించారు. నిన్న జరిగిన బీజేపీ గుంటూరు సభ కోసం వైసీపీ-బీజేపీ జెండాలున్న ఆటోలతో ప్రజలను తరలించారని పేర్కొన్నారు.