రామగుండం ఫర్టిలైజర్స్ కంపెనీ పునరుద్ధరణకుప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే చందర్, రామగుండం ఫర్టిలైజర్స్ కంపెనీ ప్రతినిధి బృందం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
కంపెనీ కార్యకలాపాల ప్రారంభం కోసం అవసరమైన అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కంపెనీ పునరుద్ధరణకు కృషి చేశామన్నారు. అందుకే కంపెనీ పునరుద్ధరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష భాగస్వామ్యం తీసుకున్నది. మూతబడిన బిల్ట్ లాంటి కంపెనీలను తిరిగి ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ తరపున ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఫ్యాక్టరీకి అవసరమైన ఉద్యోగాల కల్పనలో స్థానికులకు సాధ్యమైనంత మేర అవకాశాలు ఇవ్వాలన్నారు. కంపెనీ అవసరాల మేరకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ద్వారా యువకులకు ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.