ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖా మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పదవీకాలం రేపటితో పూర్తి కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించడానికి బుధవారం హడావిడిగా అమరావతికి బయలుదేరి వెళ్లారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి ఆయన వెళ్లారు. అయితే సీఎం బెంగాల్ పర్యటనకు వెళ్లారు.
దీంతో మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. మంత్రి పదవికి రాజీనామా అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. చంద్రబాబు ఇచ్చే సూచనల మేరకు కిడారి తన రాజీనామా పత్రాన్ని సీఎంకు ఈరోజు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కిడారి రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది.