తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై తాము నియమించిన కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తుందనీ, అప్పుడు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొంత మంది రాజకీయ లబ్ధి కోసం సమస్యను వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
కొందరు చేస్తున్న రాజకీయాల వల్ల విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ఫలితాలపై అనుమానాలు ఉన్నవారు మరోసారి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సాంకేతిక సమస్య ఉంటే సంబంధిత గ్లోబరినీ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.