పర్యావరణ కాలుష్య రహితంగా ప్రజలు వినాయక చవితి జరుపుకోవాలని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట మున్సిపల్ ప్రాంగణంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగదీష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక పదార్థాలతో తయారు చేసే వినాయక విగ్రహాలు పలు వ్యాధులకు కారణ మవుతున్నాయన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా జల కాలుష్యం పెరిగిపోతుందన్నారు. ప్రభుత్వం తరపున సూర్యాపేట మున్సిపాలిటీ నియోజకవర్గ పరిధిలో 100 కు పైగా 5 ఫీట్ల విగ్రహాలు, 3 వేల విగ్రహాలు ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో చవితి జరుపుకోవాలని అన్నారు.