ఏ శాఖ అయినా బాధ్యతగా నిర్వహిస్తానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రెండోసారి పదవి దక్కించుకున్న జగదీశ్ రెడ్డి అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. పదవులు అంటే అధికారం కాదని, బాధ్యత అని ఆయన చెప్పారు. ప్రజలకు సేవ చేసే విషయంలో మంత్రిగా తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. రెండోసారి మంత్రిగా పని చేసే అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గతంలో విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేసిన మీకు మళ్లీ అదే శాఖ ఇచ్చే అవకాశాలున్నాయా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తనకు ఏ శాఖ కేటాయించినా ఫర్వాలేదని చెప్పారు. మంత్రి వర్గంలో మహిళలకు స్థానం లేనంత మాత్రాన తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పక్షపాతి అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తమ ప్రభుత్వ హయాంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు.